48 గంట‌లే గడువు.. విద్యుత్ ప్లాంట్లు పేల్చేస్తాం: ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్‌

  • హ‌ర్మూజ్ జలసంధి తెరవకపోతే విద్యుత్ ప్లాంట్లు ధ్వంసం చేస్తామని హెచ్చరిక
  • ఇది అమెరికా సమస్య కాదు, మిత్రదేశాలు బాధ్యత తీసుకోవాలని వ్యాఖ్య
  • కాల్పుల విరమణ ప్రతిపాదనలను తోసిపుచ్చిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. హ‌ర్మూజ్ జలసంధిని 48 గంటల్లోగా పూర్తిస్థాయిలో, ఎలాంటి బెదిరింపులు లేకుండా తిరిగి తెరవకపోతే, ఇరాన్‌లోని విద్యుత్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'లో ఆయన ఓ పోస్ట్ పెట్టారు.

"ఇరాన్ 48 గంటల్లో హ‌ర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవాలి. అలా చేయని పక్షంలో అమెరికా వారి విద్యుత్ ప్లాంట్లను పేల్చివేస్తుంది. అన్నింటికంటే ముందు అతిపెద్ద ప్లాంట్‌తోనే దాడి మొదలుపెడతాం" అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. అంతకుముందు ఈ వివాదంలో కాల్పుల విరమణకు వస్తున్న పిలుపులను ఆయన తోసిపుచ్చారు.

ఈ కీలకమైన వాణిజ్య మార్గాన్ని సురక్షితంగా ఉంచాల్సిన బాధ్యత మిత్రదేశాలు, ప్రధాన ఆర్థిక వ్యవస్థలదేనని ట్రంప్ అన్నారు. "అమెరికాకు హ‌ర్మూజ్ జలసంధితో అవసరం లేదు. ఐరోపా, కొరియా, జపాన్, చైనాలకు అది అవసరం. కాబట్టి వారే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి" అని విలేకరులతో వ్యాఖ్యానించారు.

అదే సమయంలో కాల్పుల విరమణకు ససేమిరా అన్నారు. "ప్రత్యర్థిని పూర్తిగా నాశనం చేస్తున్నప్పుడు కాల్పుల విరమణ చేయరు. మేము ఆ ఆలోచనలో లేము" అని స్ప‌ష్టం చేశారు. ఇరాన్ సైనిక సామర్థ్యం పూర్తిగా దెబ్బతిన్నదని, వారి వద్ద నౌకాదళం, వైమానిక దళం వంటివి లేవని, వారి నాయకులందరూ హతమయ్యారని ట్రంప్ పేర్కొన్నారు.

Donald Trump
Iran
Strait of Hormuz
US Iran relations
Iran nuclear program
Trump Iran warning
Middle East tensions
US foreign policy
Iran power plants
Military conflict

More Telugu News